Muslims Ongole Declaration


Muslim Thinkers Forum (MTF)
ముస్లిం ఆలోచనాపరుల వేదిక
Press Note Ongole  25 June 2018
ఓటర్ల జాబితా తప్పులపై ముస్లింల ఆందోళన





ఓటర్ల నమోదులో  ముస్లింల మీద సాగుతున్న వివక్షను వెంటనే సరిదిద్డాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) ని ముస్లిం ఆలోచనాపరుల వేదిక (ఎంటిఎఫ్) కోరింది. సకాలంలో అలా జరగని పక్షంలో  ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ముందు ఆందోళనను చేపడతామని ఎంటిఎఫ్ కన్వీనర్ ఏ యం ఖాన్ యజ్దానీ (డానీ) ఒంగోలులో హెచ్చరించారు.   

ఆంధ్రా ముస్లింలు - రాజకీయ దశదిశ -2019 అనే పేరుతో ఎంటిఎఫ్ శని, ఆదివారాల్లో ఒంగోలులో ముస్లిం రాజకీయ మేధోమధన సదస్సు నిర్వహించింది. పదమూడు జిల్లాల నుండి దాదాపు 65 మంది ముస్లిం ఆలోచనాపరులు పాల్గొన్న ఈ సదస్సులో రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక రంగాలలో ముస్లింలకు జరుగుతున్న అన్యాయాల మీద వక్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశ జనాభాలో ముస్లింలు 14.2 శాతం వున్నారని అధికారిక గణాంకాలు చెపుతుండగా, ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలో ముస్లింలు 4.5 శాతం మాత్రమే వున్నారని  గుర్తు చేసింది. ఒకవైపు దేశంలో ముస్లింల జనాభా పెరిగిపోతున్నదని బీజేపి ప్రచారం చేస్తుంటే, మరోవైపు ఓటర్ల జాబితాలో ముస్లింల సంఖ్య తగ్గిపోతున్నదని వారు వివరించారు. ఎన్నికల్లు జరగక ముందే ముస్లిం సమాజాన్ని ఓడించే కుట్ర జరుగుతున్నదనీ  ఇది అప్రజాస్వామికమని సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది.  ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కోరారు. తమకు న్యాయం జరగని పక్షంలో రాష్ట్ర ముస్లింలు ఆందోళనల్ని చేపట్టడానికి కూడా వెనుకాడరని  డానీ అన్నారు.

ముస్లిం ఆలోచనాపరుల మేధోమధన సదస్సులో పాల్గొన్న ప్రముఖుల్లో చరిత్రకారుడు సయ్యద్ నశీర్ అహ్మద్, కవులు అబ్దుల్ వాహెద్,  నబీ కరీం ఖాన్, సాబీర్ హుస్సేన్, ఎఫ్ డిసిఏ రాష్ట్ర కన్వీనర్ కేయంఎ సుభహాన్, ముస్లిం రైట్స్ ఫెడరేషన్ అధ్యక్షులు షేక్ కరీముల్లా షా, ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ఖాజా వలీ,  రాజకీయ విశ్లేషకులు సయ్యద్ రఫీ, డాక్టర్ రెహమాన్,డాక్టర్ హుస్సైనీ, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ సమితి నాయకులు అబ్దుల్  మతీన్, అడ్వకేట్ జహా ఆరా, విశ్రాంత జాయింట్ కలెక్టర్ ఎంఏ.  షంషేర్ అహ్మద్ , ముహమ్మద్ అబ్దుల్ ఖాదర్,  ఉమర్ ఫారూఖ్ ఖాన్, సయ్యద్ సమీ, ఇనాయతుల్లా ఖాన్, పాత్రికేయులు షఫీ అహ్మద్,  తదితరులు వున్నారు. 

ధార్మికరంగంలో మతసామరస్యం, రాజకీయరంగంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ముస్లింల విధానాలని సదస్సు గుర్తుచేసింది. ఆరెస్సెస్ – బీజీపీలతోతప్ప హిందూ మత సమాజంతో ముస్లింలకు ఇబ్బంది ఏమీలేదనీ, క్షేత్రస్థాయిలో రెండు మత సమూహాలు సామరస్యంగా,  ప్రేమాభిమానాలతో ప్రశాంతంగా జీవిస్తున్నాయని పలువురు వక్తలు వివరించారు.

రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు ముస్లిం సమాజానికి అనేక వాగ్దానాలు చేసి, అధికారాన్ని చేపట్టాక వాటిని గాలికి వదిలేస్తున్నాయని సదస్సు అభిప్రాయ పడింది. 2019 లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో  ముస్లిం వ్యతిరేక రాజకీయ పార్టీలను ఓడించే విధంగా కార్యాచరణ రూపొందించాలని సదస్సు తీర్మానించింది.

ఆలోచనాపరుల వేదికగా మొదలై ఆచరణ దిశగా సాగిన ఎంటిఎఫ్ ఇక ముందు ప్రజాందోళనల్ని సహితం చేపట్టాలని సదస్సులో నిర్ణయించారు.  వివిధ జిల్లాలు, పట్టణాలలో ముస్లింల సంక్షేమం కోసం కృషి చేస్తున్న అనేక సంఘాలు, సంస్థలతో త్వరలోనే విజయవాడలో ఒక విస్తార సదస్సు నిర్వహించి ముస్లిం ఐక్య  కార్యాచరణ సమితి (జేఏసి)ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నట్టు  ముస్లిం ఆలోచనాపరుల వేదిక ప్రకటించింది.

సాటి అణగారిన సమూహాలైన క్రైస్తవులు,  ఆదివాసులు, దళితులు, బహుజనులు తదితరులతో రాజకీయ ఐక్య సంఘటనలు నిర్మించడానికి ప్రత్యేకంగా కృషిచేయాలని సదస్సు ఇంకో తీర్మానం చేసింది. 

ఒంగోలు సదస్సుకు ఆతిధ్యం ఇచ్చిన నబీ కరీం ఖాన్, షేక్ కరీముల్లా షా లకు  ఎంటిఎఫ్ ధన్యవాదాలు తెలిపింది.

విడుదల చేసినవారు
యం ఖాన్ యజ్దానీ (డానీ), కన్వీనర్, ముస్లిం ఆలోచనాపరుల వేదిక
A M Khan Yazdani (Danny) , Convener, Muslim Thinkers Forum (MTF)
Mobile 9010757776

Ongole, 24 June 2018



Comments

  1. గణాంకాలు లేకుండా యధాలాపంగా ప్రెస్ నోట్స్ ఎంలాభం ? ఆలోచించండి.

    ReplyDelete
  2. అధికారిక గణాంకాలు ఇవ్వాలి. వాటిమీద ఆధారపడి డిమాండ్ వ్యక్తం చేయాలి. ఎమోషనల్ సమాచారం ఆదర్సమెగా వద్దు సుమా.ఇవన్నీ మీకు నేను చెప్పల్నా? తొందర వద్దు గణాంకాలు రాబట్టినాక నోట్ తయారు చేస్తే మంచిది కదూ. ఆలోచించండి

    ReplyDelete
  3. నశీర్ అహ్మద్ గారూ! ఇది కేవలం ఒంగోలు మేధోమధన సదస్సుకు సంబంధించిన ప్రెస్ నోట్ మాత్రమే. దీన్ని మీరు ఓటర్ల జాబితాలోని అవకతవకలపై మనం ఆరంభించ దలచిన ఆందోళనకు కరపత్రంగా అపార్ధం చేసుకున్నట్టున్నారు.

    విస్తారమైన డేటాను సేకరించాల్సిన అవసరం వున్న రీత్యా ఆందోళన కరపత్ర రచనకు ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాము. గుంటూరుకు చెందిన స్ట్రక్చరల్ డెజైనింగ్ ఇంజినీర్ హుస్సైన్ గారికి దీనికి సంబంధించిన సాంకేతిక బాధ్యతను ఇవ్వాలని నిర్ణయించాము. ఇది ఒకరిద్దరితో అయ్యేపనికాదు. అంచేత ఇందులో మరికొందరిని చేర్చి ఒక సమగ్ర కరపత్రాన్ని రూపొందించాల్సిన అవసరంవుంది.

    ఆందోళన కరపత్రం డ్రాఫ్టింగ్ కమిటీలో మీరు కూడా వుండాలని నా ప్రతిపాదన. వీటికి సంబంధించి మీ దగ్గర వున్న వివరాలవల్ల చాలా ప్రయోజనం కలుగుతుంది.


    దేశ జనాభాలో ముస్లింలు 17.22 కోట్ల మంది అంటే 14.23 శాతం అనేది మనకు అందుబాటులోవున్న అధికారిక లెఖ్ఖ. (https://www.census2011.co.in/religion.php). అలాగే, 2011 జనాభా లెఖ్ఖల నాటి గంణాకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనాభాలో ముస్లింల శాతం 9.56 %. అయితే ఇది ఉమ్మడి రాష్ట్రం నాటి సంగతి.

    నవ్యాంధ్రాలో మొత్తం జనాభా ఎంత? వారిలో ముస్లింల శాతం ఎంత అనేది కొంచెం రీసెర్చ్ చేయాల్సిన అంశం.

    విభజిత ఆంధ్రప్రదేశ్ లో 2015 జనవరి నెల నాటికి 3,70,82,855 ఓటర్లు వున్నారన్నది కూడా అధికారిక లెఖ్ఖే. అయితే, వీరిలో ముస్లిం ఓటర్లు ఎంత మంది? వారి శాతం ఎంత అనేది లెఖ్ఖలు కట్టాలి. వాస్తవ ఓటర్లకూ, జాబితాలో వున్న ఓటర్లకు మధ్యన వున్న వ్యత్యాసాన్ని తేల్చే యంత్రాంగాన్ని మనం సమకూర్చుకోవాలి.

    ఓటర్ల లిస్టులో ముస్లింలు కేవలం 4.5 % మాత్రమే వున్నారని హుస్సైనీ ఒంగోలు సదస్సు దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ విషయంలో ఆయన విస్తారమైన పరిశోధన చేసినట్టున్నారు. ఆ వివరాలన్నీ సేకరించే పనిలో వున్నాము. బహుశ, తదుపరి విజయవాడ సదస్సు నాటికి మన దగ్గర సమగ్ర సమాచారం వుంటుందని ఆశిస్తున్నాను.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

*జిల్లాల్లోని ప్రధాన సమస్యల్ని పోస్టు చేయండి*

Crusades - 1095–1291

Ahmad Khan - French Revolution